సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజునకు అధిష్టాన దైవం


సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం.
మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తి, ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీమానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది.
మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.
జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజలవల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని మహిళలు పూజలుచేయడం తరచుగా మనం చూస్తూ వుంటాం.
సంతానప్రాప్తిని కోరే మహిళలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని అంటారు.

మనం చేసే దోషాలు మనకు అంటకుండా తొలగించుకోవాలంటే


మనం చేసే దోషాలు మనకు అంటకుండా తొలగించుకోవాలంటే గణపతిని ఏ పూజారాధన చేస్తే ఏ దోషం పోతుందో మీకు తెలుసా?
సూర్యదోషం తొలగిపోవాలంటే ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.
చంద్రదోషం తొలగిపోవాలంటే పాలరాయితో లేదా వెండితో చేసిన గణపతిని పూజించాలి
కుజదోషం తొలగిపోవాలంటే రాగితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది
బుధ దోషం తొలగిపోవాలంటే మరకత వినాయకుడిని పూజించాలి
గురు దోషం తొలగిపోవాలంటే పసుపు, చందనంతో చేసిన లేదా బంగారంతో చేసిన వినాయకుడిని పూజించాలి.
శుక్రదోషం తొలగిపోవాలంటే స్ఫటిక వినాయకుడిని పూజించాలి
శని దోషం తొలగిపోవాలంటే నల్లరాయిపై చెక్కిన వినాయకుడిని పూజించాలి
రాహు దోషం తొలగిపోవాలంటే మట్టితో చేసిన వినాయకుడిని పూజించాలి
కేతుగ్రహ దోషం తొలగిపోవాలంటే తెల్లజిల్లేడుతో చేసిన వినాయకుడిని పూజించాలి.
అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే ఎర్రచందనంతో చేసిన వినాయకుడిని పూజించాలి
ఋణ బాధలు తొలగిపోవాలంటే పగడపు వినాయకుడిని పూజించాలి.
మానసిక ప్రశాంతత కలగాలంటే పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.
జీవితంలోని సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క వినాయకుడిని పూజించాలి
జీవితంలో సుఖశాంతుల లభ్యత కోసం స్ఫటిక వినాయకుడిని పూజించాలి.